17 ఏళ్ల క్రితం కిడ్నాప్కు గురైన ఓ మహిళ తాజాగా ఢిల్లీ లో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ఢిల్లీ గోకల్పురి పోలీసులు గురువారం తెలిపారు. డీసీపీ రోహిత్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2006లో సదరు మహిళ కిడ్నాప్కు గురైంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని గోకుల్పురి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా సదరు యువతిని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లని వారు తెలిపారు. మహిళని పీఎస్కు తీసుకొచ్చి విచారణ జరపగా.. కిడ్నాప్ తర్వాత జరిగిన పరిస్థితుల్ని పోలీసులకు వివరించింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా చెర్దీ గ్రామంలో దీపక్ అనే వ్యక్తితో నివసిస్తున్నట్లు తెలిపింది. లాక్డౌన్ సమయంలో తలెత్తిన వివాదాల కారణంగా ఇద్దరూ విడిపోయినట్లు చెప్పింది. అనంతరం గోకుల్పురి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు వివరించింది.