- వేగంగా టెట్ నిర్వహణ కసరత్తు..
- ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విద్యాశాఖ..
- టెట్ నిర్వహణకు 101 రోజుల సమయం పడుతుందట..
- ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే
మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్, 14 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కు సంబంధించిన కసరత్తు వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో టెట్ నిర్వహణ విషయమై ప్రభుత్వానికి విద్యాశాఖ కీలక నివేదికను సమర్పించింది. టెట్ నిర్వహణకు మొత్తం 101 రోజుల సమయం పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. నోటిఫికేషన్ విడుదల, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు సాఫ్ట్ వేర్ రెడీ చేయడానికి, దరఖాస్తుల స్వీకరణకు, ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజుకు 80 రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు సర్కారుకు పంపించిన నివేదికలో పేర్కొన్నారు. టెట్ పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి 21 రోజులు కలిపి.. మొత్తం 101 రోజులు పడుతుందని అంచనా వేసింది. గతేడాది మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేయగా.. పరీక్షను అదే సంవత్సరం జూన్ 27న నిర్వహించారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టెట్ నిర్వహించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. అయితే అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. టెట్ పరీక్ష నిర్వహణకే 80 రోజుల సమయం పడుతుందని విద్యాశాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో.. సెప్టెంబరు చివరి వారంలోనే టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 9,370 టీచర్ పోస్టులు ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆ వివరాలను గతేడాది మార్చి 21న విద్యాశాఖ సర్కార్కు సమర్పించింది. ఈ పోస్టులు కాక పదోన్నతుల ద్వారా 9,314 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుందని విద్యాశాక పేర్కొంది. ఖాళీల భర్తీకి ‘టెట్’ నిర్వహించి. కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. 5 వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లు అవసరమని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఉన్న ఖాళీలు :
స్కూల్ అసిస్టెంట్ – 2,179.. ఎస్జీటీ – 6360.. పీఈటీలు- 162.. భాషా పండితులు – 669 పోస్టులు..