జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో గార్విట్ గుజరాత్కు గర్వభంగం చేసిన తెలుగు టాలన్స్.. తాజాగా గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్పై మెరుపు విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో తెలుగు టాలన్స్ 40-38తో గెలుపొందింది. తొలి మ్యాచ్ తరహాలోనే తెలుగు టాలన్స్ ఆరంభంలో కాస్త నెమ్మదించింది. దీంతో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ తొలి పది నిమిషాల ఆటలో ముందంజలో నిలిచింది. 5-6, 6-7, 12-13, 14-17తో వెనుకంజ వేసిన తెలుగు టాలన్స్ ప్రథమార్థం చివర్లో పుంజుకుంది. టాలన్స్ కీలక ఆటగాళ్లు దేవిందర్ సింగ్ భల్లార్, అనిల్, రఘులకు తోడు విశాల్ హదియ సైతం జోరందుకున్నాడు. దీంతో 18-18 వద్ద స్కోరు సమం చేసిన తెలుగు టాలన్స్.. ఇక అక్కడ్నుంచి మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించింది. తొలి అర్థభాగం ఆట ముగిసే సమయానికి 21-19తో రెండు గోల్స్ ఆధిక్యంలో నిలిచిన తెలుగు టాలన్స్.. ద్వితీయార్థంలోనూ అదే దూకుడు కొనసాగించింది. గోల్ కీపర్ రాహుల్ మరోసారి కండ్లుచెదిరే ప్రదర్శనతో చేశాడు. గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ ఆటగాళ్ల గోల్ ప్రయత్నాలకు రాహుల్ అడ్డుగోడగా నిలిచాడు. 25-21, 27-23తో దూసుకెళ్లిన తెలుగు టాలన్స్.. చివర్లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. పెనాల్టీల రూపంలో గోల్డెన్ ఈగల్స్ విలువైన గోల్స్ నమోదు చేసి 37-39తో గట్టి పోటీ ఇచ్చింది. చివరి నిమిషంలో కాస్త ఉత్కంఠ కనిపించినా.. అందివచ్చిన పెనాల్టీని గోల్గా మలిచిన టాలన్స్ 40-38తో రెండు గోల్స్ తేడాతో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్పై ఘన విజయం సాధించింది. తెలుగు టాలన్స్ కీలక ఆటగాడు దేవిందర్ సింగ్ భుల్లార్ ‘గోల్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.