Tuesday, April 30, 2024

మానేరు నదిని పరిరక్షించాలి.

తప్పక చదవండి

దక్షిణ గంగగా పిలువబడుతున్న గోదావరి నదికి ఎన్నో ఉపనదులు కలవు.వాటిల్లో మానేరు, కిన్నెరసాని ముఖ్యమైనవి.ఇందులో గోదావరి కుడివైపున ఉన్న “మనైర్ లేదా మానేరు నది నిజామాబాద్ జిల్లాలో సుమారు 533 మీటర్ల ఎత్తులో జన్మించి 32 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలో ప్రహావించిన తరువాత మలుపు తీసుకొని మరో 193 కిలోమీటర్లు ఈశాన్య దిశకు ప్రహవించి 105 మీటర్ల సముద్రమట్టాన పెద్దపల్లి జిల్లా మంథని రెవెన్యూ డివిజన్లోని ఆరెందా గ్రామం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. రాజన్న-సిరిసిల్లా జిల్లా గంభీరావ్ పేట్ వద్ద ఎగువ మానేరు డ్యామ్,మధ్య మానేరు డ్యామ్, కరీంనగర్ వద్ద దిగువ మానేరు డ్యామ్ గత ప్రభుత్వాలు నిర్మించాయి.ఎగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న-సిరిసిల్లా జిల్లా, గంభీరావ్ పేట మండలం నర్మల గ్రామంలో మానేరు నదిపై నిర్మించిన జలాశయం వరంగల్, కరీంనగర్ జిల్లావాసులకు త్రాగు నీరు, సాగునీరు అందిస్తుంది.1945లో చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ పల్వంచ వాగులపై నార్మల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్ట్ పని మొదలు పెట్టి 1948లో పూర్తి చేసి ఉద్యానవనం,అతిథి గృహం నిర్మించారు.మధ్య మానేరు డ్యామ్ రాజన్న-సిరిసిల్లా జిల్లాలోని బోయిన్ పల్లి మండలం మన్వాడ గ్రామంలో నిర్మించిన జలాశయం ద్వారా 2,00,000 హెక్టార్ల భూమికి సాగు నీటికి, త్రాగు నీటికి ఉపయోగపడుతుంది.దిగువ మానేరు డ్యామ్ కరీంనగర్ పట్టణంకు ఆనుకొని ఉన్న తిమ్మాపూర్ మండలం అలుగు నూర్ గ్రామంలో నిర్మించబడి 4,00,000 ఎకరాల సాగునీటితో పాటు వరంగల్, కరీంనగర్ నగరాలకు,సిద్దిపేట జిల్లాలోని కొన్ని గ్రామాలకు త్రాగునీరు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత గోదావరి నదిపై ఎల్లంపల్లి,సుందిళ్ళ, అన్నారం,మేడిగడ్డ-కాళేశ్వరం గ్రామాల వద్ద నాలుగు బ్యారేజులు నిర్మించి ఎత్తిపోతల విధానంతో 9,00,000 మెగావాట్ల విద్యుత్ మోటార్లతో నీటిని ఎత్తిపోస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు కోటి నలభై లక్షల జనాభా కలిగిన హైదరాబాద్ నగరానికి నీరు అందిస్తుంది. కరీంనగర్ నగరంలో దాదాపు 4,00,000 జనాభా కలదు.ఈ నగరం వద్ద గల మానేరు నదిని ప్రజలు విసర్జించే మల,మూత్రాలు, ఆటో గ్యారేజులు, మెకానిక్ షెడ్లు వాడే సబ్బు నురగ నీరు, కుళ్లిన కూరగాయలను, కుళ్లిన మాంసంను దుకాణదారులు వదిలిన మురికి, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు వదిలిన మురికిని శుద్ధి చేయకుండా వడలడంతో నది కలుషితమవుతుంది. అలాగే కరీంనగర్ లో ఉన్న ఆసుపత్రుల్లో రోగులు ద్వారా వచ్చే చీము, రక్తం కూడా కాలువల ద్వారా నదికి చేరుతున్నాయి.కావున ప్రజలు వదిలే నాలుగు కోట్ల లీటర్ల మురికిని నీరు శుద్ధి చేసి పరిశ్రమలకు,నగరంలోని పార్కులకు,నగరం చుట్టూ ప్రక్కల గల వ్యవసాయ భూములకు వాడుకున్న తరువాత మిగిలిన నీటిని శుద్ది చేసి మానేరు నదిలోకి వదలడం ద్వారా నది కలుషితం కాకుండా నివారించేందుకు అధికారులు కృషి చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలి.

  • ఆళవందార్ వేణు మాధవ్
    8686051752, హైదరాబాద్.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు