రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్ మద్దతు ప్రకటించారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లోని భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్ల నిరసన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా సిగ్గు చేటు. అలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అతడు తల్లులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ల గురించి ప్రతిరోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది’ అని అన్నారు.
కాగా, బ్రిజ్ భూషణ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. ఇంత వరకు అరెస్టు చేయకపోవడంపై రాందేవ్ బాబాను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన రామ్దేవ్.. తాను కేవలం ప్రకటనలు మాత్రమే చేయగలనని చెప్పారు. అతడిని జైల్లో పెట్టే అధికారం తనకు లేదంటూ బదులిచ్చారు.