హైదరాబాద్ నగర పరిధిలోని బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు. ఈ ప్రమాదంలో క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. కూకట్పల్లి నుంచి బాలానగర్ వైపు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.