- పాఠశాల ప్రహరీగోడ కట్టించిన కాంట్రాక్టర్..
- పునాది కోసం తీసిన మట్టి డ్రైన్ లో పంచాయతీ కార్మికులతో
పని చేయించిన వైనం.. - సర్పంచ్, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పంచాయితీ నిధులను
దోచేశారంటున్న స్థానికులు.. - ఉన్నతాధికారులు విచారణ జరిపి దోషులను శిక్షించాలని
కోరుతున్న స్థానిక ప్రజలు..
లక్ష్మీదేవిపల్లి, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మన ఊరుామన బడి కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ గ్రామంలో ఉన్న పాఠశాల ప్రహరీగోడ నిర్మాణాన్ని చేపట్టాడు ఓ కాంట్రాక్టర్. అయితే ఆ ప్రహరీ గోడ కోసం పునాది తీయగా పునాది మట్టి పక్కనే ఉన్న డ్రైన్లో పడిపోయింది.. దీంతో ఆడ్రైన్ గుండా వెళ్లే నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి మురుగువాసనను వెదజల్లుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ డ్రైన్లో పడిన మట్టిని తొలగించాల్సి ఉన్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా తన ప్రహరీగోడల పనులను ముగించుకొని వెళ్లిపోయాడు. దీంతో డ్రైన్లో పడ్డ మట్టిని పంచాయతీ కార్మికులతో తొలగించారు. కాంట్రాక్టర్తో డ్రైన్లో పడ్డ మట్టి తీయించాల్సి ఉన్నప్పటికీ.. పంచాయతీ కార్మికులతో తీయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ సొమ్మును సర్పంచ్, కార్యదర్శి వృధా చేశారని గ్రామప్రజలు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్, సర్పంచ్ కుమ్మక్కై పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని, ఆవిషయంపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేశారు. అదే విధంగా డ్రైన్లో పడిన మట్టిని తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు.