Tuesday, May 21, 2024

ప్రభుత్వ ఆదాయ వనరు.. ప్రజారోగ్యం బేజారు (వ్యాసం)

తప్పక చదవండి

మనిషి ప్రశాంత జీవనాన్ని చెడగొట్టి అనర్ధాలకు, అనారోగ్యానికి గురిచేసే మద్యపాన వ్యసనాన్ని తక్షణమే నియంత్రించుకుంటూ పూర్తిగా మానివేయాలని దుర్భర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. సామాజిక బాధ్యతతో ప్రభుత్వాలు కూడా వెనువెంటనే నిషేధించాల్సి ఉంది. తాత్కాలికంగానో, సరదాల పేరుతో మద్యపాన వ్యసనానికి (మత్తుకు) బానిసై కుటుంబ బాధ్యతలను, బంధాలను సామాజిక బాధ్యతలను విస్మరించి వయో( లింగ )బేధాలు మరిచి చిత్తుగా తాగేస్తూ ఇల్లును, ఒల్లును గుల్ల చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. మనసును, నాలుకను అదుపు చేసుకొనలేని స్థితిలో మద్యానికి బానిసగా మారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మద్యం అమ్మకాల పై ప్రభుత్వ నివేదికలే ప్రస్తుత దుర్భర పరిస్థితిని రూడీ చేస్తున్నాయి. గుడి, బడి అనే తేడా లేకుండా ఇలా అడుగడుగునా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు దర్శనమిస్తున్న వాస్తవాన్ని కాదనగలమా! వ్యక్తులు, వ్యవస్థలు మద్యం వినియోగం(వ్యాపారం) జోరు పెంచుకుంటూ.. ఆ ఆదాయంతోనే నేడు ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే? పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతుంది. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ.. అబ్బే తప్పు చేశామని చింతిస్తూ, తిరిగి మళ్లీ అదే తప్పులు చేస్తుంటే? దానిని పశ్చాత్తాపమంటారా! ఆ పశ్చాత్తాపానికి విలువేముంది. ప్రజారోగ్యానికి పట్టం కట్టాల్సిన ప్రభుత్వాలు, వ్యక్తుల తొందరపాటు నిర్ణయాలు, చర్యల మూలంగా రేపటి సమాజం ఎన్నో అనర్ధాలు, మానసిక బలహీనతలతో రోగగ్రస్తంగా మారబోతుందని గమనించండి. ఆ సమాజం ముందు నేటి వ్యక్తులు, వ్యవస్థలు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ప్రభుత్వాలు, మనుషులు సమిష్టిగా ఈ మద్యం వల్ల జరిగే అనర్థాలు, నష్టాల నుండి చైతన్యవంతులై అవగాహన పెంచుకుంటూ క్రమేణా నియంత్రిస్తూ, నిషేధించే విధానాలు రావాలి. ఈ ప్రశ్న అడిగే వారు లేరు? ఎందుకంటే క్రమ క్రమేణా అందరినీ ఈ ఊబి (మద్య వ్యసనం)లోకి ప్రభుత్వాలు నెట్టి వేస్తున్నాయి.. బాధితులు ఊగిపోతున్నారు. వీరు, వారు ఎలా సమర్థించుకుంటారంటే ?అబ్బే నేనేమీ ఎక్కువ మద్యం తాగడం లేదు. తినే ముందు రోజుకు ఒక పెగ్ ఏస్తుంటా అంతే!. కొందరు అదీ అప్పుడప్పుడే చుట్టాలు, స్నేహితులు వస్తే కొద్దిగా మరి తప్పదుగా అంటారు. ఇంకొందరు ధనవంతులు, ధనవంతులని నమ్మించాలని నేనైతే చాలా ఖరీదైన మద్యం తాగుతాను అంటారు. నేనైతే ఫారెన్ సరుకునే తీసుకుంటానంటారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదవారు పొద్దస్తమానం కాయకష్టం చేసి రాత్రి ఆ బాధను మర్చిపోవడానికి చీప్ లిక్కర్ తో పూట గడిపేస్తారు. మనుషులు వారి వారి స్థాయిలను బట్టి ప్రతిరోజు మద్యం తాగడం పరిపాటిగా మారిపోతుంది. మద్యం లేని పెళ్లి లేదు, పుట్టుక లేదు, పండుగ లేదు, కాలక్షేపం లేదు. చివరకు చావుకు కూడా అది లేకుండా అంతిమయాత్ర సాగదు. ఇది ఎవరు కాదనలేని పచ్చి నిజం. ఈ పరిస్థితి మార్చలేమా.. మద్యం తాగడం (వ్యసనం) వల్ల జరిగే అనర్ధాలు, అనారోగ్యాలకు ముమ్మాటికి మనమే కారణం. వైద్యులు ఒకవైపు మద్యం కొంత తాగినా, ఎంత తాగినా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా ఈ మధ్య మద్యం తాగడం మూలంగా అనర్థాలు, అనారోగ్యంపై అంతర్జాతీయ పరిశోధన ద్వారా వెల్లడైన కీలక అంశాలు ఇలా ఉన్నాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ పావులేషన్ హెల్త్ పేకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు చాలా కాలంగా సుమారు 5 లక్షల మంది మద్యం బాధితులపై కీలక పరిశోధన చేసి విస్తుపోయే నిజాలను వెల్లడించారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్యం 28 రోగాలకు కారణం అవుతుందని తేల్చి చెప్పింది. కానీ నేడు మద్యం తాగడం వల్ల ప్రత్యక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధన స్పష్టం చేయడం గమనార్హం. మద్యం ఎక్కువ తాగినా తక్కువ తాగినా మనిషి శరీరంలోని అన్ని అవయవాలపై దాని దుష్ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా తాగడం వలన ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని, కోట్ల మంది అనారోగ్యం, అంగవైకల్యానికి గురవుతున్నారని తెలిపింది. ఈ తాజా అధ్యయనం నేచర్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితమైనది. వివిధ వయసులకు చెందిన 5,12,724 మందిపై చైనాలో ఐదేళ్లపాటు అధ్యయనం చేశారు. సుమారు లక్ష మందికి పైగా మద్యం తాగిన బాధితుల ఆరోగ్య సమస్యలను పరిశీలించారు. వారి జీవనశైలి, ప్రవర్తన, మద్యం అలవాటు, జరుగుతున్న చికిత్స వివిధ అవయవాలపై దాని దుష్ప్రభావం, క్రమం తప్పకుండా తాగే వారిని, అప్పుడప్పుడు తాగే వారిని ఇలా12 ఏళ్ల దవాఖానాల రికార్డులు అనుసంధానం చేసి అంచనా వేశారు. జన్యు విశ్లేషణ కూడా చేశారు. మద్యం తాగే వారు 35 ఏళ్ల నుంచి 84 ఏళ్ల లోపు దవఖానాల్లో చేరడమో, మరణించడమో జరిగిందని గుర్తించారు. చివరగా తెలిసి వచ్చే అంశం ఏమిటంటే? మద్యం తాగడం వల్ల మనకై మనమే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అని తెలు స్తుంది. ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలిలో మద్యం తాగడం బాగా అధికమవుతుంది. ఎంతగా ఉందంటే? అది అన్లిమిటెడ్ గా, అన్ స్టాపబుల్ గా, తీవ్రంగా, భయానకంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు, స్త్రీలలోను తాగే వారి వాటా ఎక్కువైపోతుంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి కూడా తాగాలనే కుంటి సాకులతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా తాగే వారిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. బీపీ పెరుగుతుంది, షుగర్, గుండె సమస్యలు, కడుపులో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, మెదడు, కాలేయంకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. దీనికి బానిసగా మారిన కొంతమందిలో ఆ మత్తులో హింసాప్రవృత్తి పెరిగిపోతుంది. నేడు సమాజంలో జరిగే హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలు, వాహన ప్రమాదాలు తదితర ఘటనలకు ప్రధాన కారణం మద్యం తాగడం వల్లనేనని ఎన్నో నివేదికలు తెలిపినాయి. అయినా పాలకుల్లో, పాలితుల్లో మార్పు రాలేదు. రోజు రోజుకు మద్యం తాగడం పెరిగిపోతూనే ఉంది. ఇలా అయితే ఎలా? మద్యం సృష్టించే విధ్వంసం అణు విస్ఫోటనం కన్నా మిన్నగా, స్లో పాయిజనై ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందనే సోయి కూడా లేదు. కావున పాలకులారా.. పాలితులారా.. నియంత్రిస్తూ, నిషేధించాలి. మద్యం ప్రియులు దీన్ని మానేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని, మానేయడమే పరిష్కారమని భావించండి. పాలకులు మానవీయ కోణంలో ఆలోచించి నియంత్రిస్తూ, నిషేధం వైపు అడుగులు వేయాలి. పాలకులు ఆ ప్రజారోగ్య నిర్ణయానికి కట్టుబడాలి. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. ఆనందానికి మించిన ప్రశాంతత లేదు. మద్యం వద్దే వద్దు.. ఆరోగ్యమే ముద్దు..

  • మేకిరి దామోదర్,
    సామాజిక విశ్లేషకులు, వరంగల్ ఫోన్: 95736 66650.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు