- తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు..
- 30 రోజుల్లో 7.44 కోట్ల రూపాయల బీర్లను లాగించేశారు..
- ఎండలు తీవ్రంగా ఉండటంతో చల్లని బీర్లకు ఓటేస్తున్న జనాలు..
- నెలరోజుల వ్యవధిలో చరిత్ర సృష్టించిన బీరు బాబులు..
- ఒకవైపు వాన వరద.. మరోవైపు బీర్ల వరద..
తెలంగాణలో అభివృద్ధి మాటేమో గానీ, రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో వైన్ షాప్ లు ఎప్పుడూ మందుబాబులతో కలకలలాడుతూనే ఉంటాయి. పండగొచ్చినా, పబ్బమొచ్చినా, బాదొచ్చినా సంతోషమొచ్చినా మందుబాబులకు చుక్క పడాల్సిందే.. అకేషన్ ఏదైనా మద్యం ప్రియులకు పార్టీలో మందు పక్కా ఉండాల్సిందే. కూలి నాలి చేసుకునేవాళ్లకు సాయంత్రం పెగ్ వేస్తే కానీ నిద్రపట్టదు. ఇక యూత్ ఎంజాయ్ చేయడం కోసం మందు కొడుతుంటారు. కాబట్టి మద్యం అమ్మకాలు అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కువే ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు కూడా దాదాపు మద్యం వ్యాపారమే. అయితే తెలంగాణలో మాత్రం అన్నిరాష్ట్రాలకంటే ఎక్కువుగా, జోరుగా అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రతినెలా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. రికార్డు బద్దలయ్యేలా బాటిల్ మీద బాటిల్ ఎత్తి తెగ లాగించేస్తున్నారు. చురుక్కుమనిపిస్తున్న ఎండల్లో చిల్డ్ బీరును ఎంజాయ్ చేస్తున్నారు మద్యం ప్రియులు. ఎండల తీవ్రత మరింత పెరగడంతో మందు బాటిల్ పక్కన పెట్టి.. బీరు సీసా ఎత్తుతున్నారు. విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వారు సైతం ఎండల ప్రతాపంతో వాటిని త్రాగకుండా బీరు వైపు చూస్తున్నారు. రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్న బీర్ సేల్సే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో బీర్లు తాగేశారు. గత రికార్డులను తిరగరాస్తూ.. ఏకంగా నెల రోజుల వ్యవధిలో 7.44 కోట్ల బీర్లను మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు. మే నెలలో ఎండలు విపరీతంగా ఉండటం, ఆపై పెళ్లిళ్ల సీజన్ కావటంతో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఒక్క మే నెలలోనే రికార్డు స్థాయిలో 7.44 కోట్ల బీరు సీసాలు అమ్ముడైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 2019 మే నెలలో రికార్డు స్థాయిలో 7.2 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. తాజాగా.. ఆ రికార్డును బద్దలు కొడుతూ తెలంగాణలోని మందుబాబులు 7.44 కోట్ల బీర్లు మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు. ఎండలు దంచి కొట్టడం, పెళ్లి వంటి శుభకార్యాలు ఉండటంతో బీర్ల సేల్స్ పెరిగినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని ఓ అధికారి వెల్లడించారు. అయితే కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్లో అమ్ముడు పోతే మొత్తం మధ్యం అమ్మాకలు ఏ రేంజ్లో ఉంటాయోనని పలువురు ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వెయ్యికిపైగా బార్లు, క్లబ్లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. ఇందులోనూ మద్యం సరఫరా ఉంది. వీటి ద్వారా రోజుకు రూ.90 నుంచి రూ.100 కోట్లు విలువైన మద్యం సేల్ అవుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.35,145.10 కోట్లు విలువైన 3.52 కోట్లు లిక్కర్ కేసులు, 4.79 కోట్లు బీరు కేసులు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం తాగే మందుబాబుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో మద్యం ఆదాయం కూడా పెరుగుతోంది.