- పెట్రో రేట్లు తగ్గడం లేదు..
- ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..
- ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు..
అంతర్జాతీయ మార్కెట్లో 2014లో బ్యారెల్ ముడిచమురు ధర 113 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోలు ధర లీటరు రూ.72 ఉంది. ఇప్పుడు అదే ముడిచమురు ధర 70 డాలర్లుగా ఉంది. అలాంటప్పుడు పెట్రోలు ధర లీటర్ ఏ 50, 60 రూపాయలో ఉండాలి. అయితే మోదీ ప్రభుత్వంలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.109. దీనిని బట్టి ప్రభుత్వం ప్రజలను ఎలా దోపిడీ చేస్తున్నదో అర్ధమవుతున్నది.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏడాది వ్యవధిలో 32 శాతం తగ్గింది. 18 నెలల కనిష్ఠానికి దిగొచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లను సర్కారు సవరించట్లేదు. క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకున్న మోదీ సర్కారు.. రేట్లు తగ్గినా ఆ ప్రయోజనాన్ని సామాన్యుడికి దక్కనీయడం లేదు. దీనిని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా అంగీకరించింది. లోక్సభలో ఇటీవల ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ‘2022 జూన్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతథంగానే ఉన్నాయి’ అని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్పురి సమాధానమిచ్చారు.
తగ్గకపోగా.. బాదుడే బాదుడు
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయంగా పెట్రో ధరలు తగ్గాలి. కానీ కేంద్రం ఇంధన ధరలను పెంచుకుంటూ పోతున్నది. గడిచిన 9 ఏండ్లలో కేంద్రం పెట్రోల్పై 109 శాతం ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, డీజిల్పై ఏకంగా 343 శాతం పన్ను పెంచిందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాలు చెప్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకొన్న కేంద్రం.. దాన్ని ఎక్కువ ధరకు పశ్చిమ దేశాలకు ఎగుమతి చేసింది. దేశంలో పెట్రో ధరలను మాత్రం తగ్గించలేదు.