Friday, May 3, 2024

‘బోధి ధర్మ’ పేరుతో బోడిగుండు..

తప్పక చదవండి
  • తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అంటూ శఠగోపం..
  • ఆయుర్వేద వైద్యపీఠం ద్వారా అమాయకులకు గాలం..
  • బోడుప్పల్ లో వెలుగుచూసిన నకిలీ వైద్య లీలలు..
  • ఏ అర్హత లేకుండా డాక్టర్ నని చెప్పుకుంటున్న పండిట్ శ్రీనివాస్ గురూజీ..
  • వేల రూపాయలు వసూలు చేస్తూ మూలికా వైద్యం చేస్తున్న వైనం..
  • ఒక్కో రోగానికి ఒక్కో రేటు.. ఆరోగ్యాలపై వేటు..
  • అద్భుత ఔషధాలు అంటూ విస్తృత ప్రచారం..
  • బోధిధర్మ ఆయుర్వేద పీఠంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బాధితులు..

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ ఉంటుంది.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ అనేది ఎంతో కష్టతరంగా మారింది.. దీనికి తోడు అంతంత మాత్రం సంపాదనతో జీవితం వెళ్లదీస్తున్న వారు.. ఆసుపత్రులు, మందుల ఖర్చులకోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.. కాగా అణువణువూ వేళ్ళూనుకు పోయిన మెడికల్ మాఫియా దాష్టీకంతో ఆరోగ్యం కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఈ క్రమంలో చాలామంది ఆయుర్వేదంవైపు మొగ్గుచూపడం మొదలుపెట్టారు.. మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఆయుర్వేద ప్రక్రియపై నమ్మకంతో.. ఖర్చు కూడా తక్కువ అవుతుండటంతో మెజారిటీ పీపుల్ ఆయుర్వేదాన్ని నమ్ముకోవడం మొదలుపెట్టారు.. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న కొందరు నకిలీ ఆయుర్వేద వైద్యులు చెట్టుకొకరు, పుట్టకొక్కరు పుట్టుకు వచ్చారు.. అమాయకులను మాయ మాటలతో నమ్మిస్తూ.. తెలిసీ తెలియని వైద్యంతో.. ప్రాణాలమీదకు తెస్తున్నారు.. అంతే కాకుండా తక్కువ ఖర్చు అని చెబుతూనే వేలల్లో వసూలు చేస్తున్నారు.. ఇలాంటి దారుణ పరిస్థితులే బోడుప్పల్ లో నెలకొన్న బోధిధర్మ ఆయుర్వేద పీఠంలో వెలుగు చూసింది.. బాధితులు అందించిన వివరాలు మీకోసం..గ్రామీణ ఖర్చులకే కార్పోరేట్ వైద్యం అంటూ..బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ద్వారా.. 12 రాష్ట్రాలలోని అనువంశిక ఆయుర్వేద వైద్యులచే తయారు చేయబడిన అద్భుత ఔషదాలు అంటూ.. మాయ మాటలతో మభ్య పెడుతూ జనాలను మోసం చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారు ఆయుర్వేద రత్న, ఆయుర్వేద సామ్రాట్ , ఆయుర్వేద విభూషణ్ అవార్డుల గ్రహీత డాక్టర్. పండిట్ శ్రీనివాస్ గురూజీ .. ఆయన పర్యవేక్షణలో సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న తమ వైద్య పీఠం సేవలు అందరూ వినియోగించు కోవాల్సిందిగా కోరుతూ రంగురంగుల బ్రోచర్లతో.. ప్రజలకు మోసం చేస్తున్న ఈ ప్రముఖ దొంగ డాక్టర్.. బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం, హెడ్ ఆఫీస్: పిల్లర్ నెం. 81. బండి కన్వెన్షన్ ఎదురుగా, బోడుప్పల్, ఉప్పల్, హైదరాబాద్ లో తమ ఆయుర్వేద పీఠాన్ని స్థాపించి అమాయకులను నిలువునా ముంచుతున్నాడు.. ఈ నకిలీ డాక్టర్ వ్యవహారంపై ‘ఆదాబ్’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

తాము తయారు చేసిన బ్రోచర్ లో ఆకర్షించే పదాలు మీ కళ్ళను మోసం చేస్తాయి.. నిజమేనేమో అనేలా మీ ఆలోచనా ధోరణిని కట్టిపడేస్తాయి.. ఏలాంటి కంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. కంటి శుక్లాలు ఆపరేషన్ లేకుండా చుక్కల మందుతో కరిగించబడును. పక్షవాతం ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చిన వారికైననూ కేవలం 12 నెలలో పూర్తిగా ఉపశమనం కలిగించబడును.. మోకాళ్లలో గుజ్జు అరిగిన వారికి.. వారు ఏ వయస్సు వారైనా కేవలం 3 నుండి 6 నెలల్లో మా చూర్ణం ద్వారా పూర్తి ఉపశమనం కలుగుతుంది.. అదేవిధంగా వెన్ను పూస, అన్ని రకాల కీళ్ళ నొప్పులకు, కండరాల నొప్పులకు పూర్తి చికిత్స అందించబడును..
ఆపరేషన్ తో పనిలేకుండా సైనస్, గర్భసంచిలో నీటి బుడగలు, కిడ్నీలో రాళ్లు, చెవి వినికిడి సమస్యలు, మోకాళ్ల నొప్పులు, ఆర్షమొలలు, వెరికోస్ వెయిన్స్ లాంటి వాటికి ఎలాంటి ఆపరేషన్ లేకుండా పూర్తి చికిత్స చేయబడును.. సంతానం లేని దంపతులకు ప్రత్యేక చికిత్స ద్వారా కేవలం మూడు నుండి 6 నెలల్లో సంతాన ప్రాప్తి కలిగించబడును.. సొరియాసిస్ తో ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుచున్న వారికైన కేవలం 6 నెలల్లో పూర్తిగా తగ్గించబడును.. ఎటువంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికైన తమ వద్ద 90 రోజుల చికిత్స తర్వాత.. గ్యారంటీగా పూర్తి ఉపశమనం కలుగును. సెక్స్ సమస్యలు, నిద్రలేమి, చర్మవ్యాధులు, మొండి వ్యాధులకు గ్యారంటి చికిత్స కలదు. మైగ్రెయిన్ పెయిన్, ఫిట్స్, షుగర్, థైరాయిడ్ కు కూడా పూర్తి చికిత్స కలదు. డెంగ్యూ వ్యాధి సోకిన వారికి తెల్ల రక్తకణాల కౌంట్ కేవలం 5 రోజులలో పెంచగలిగే అద్భుత ఔషదాలు మా ప్రత్యేకత. అంటూ అమాయకులను ఆకర్షించడం ఈ డాక్టర్ కి వెన్నతో పెట్టిన విద్య.. ఇలాంటి నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం చేయించుకోవాలి.. అప్పుడే సరైన ఫలితం దక్కుతుంది.. రక రకాల రోగాలు నయం చేస్తానని చెబుతూ తనను నమ్మి వచ్చిన వారిని మోసం చేస్తూ.. ఎలాంటి ప్రాకృతిక విలువలు లేని ఆయుర్వేద మందులు ఇస్తున్న బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం, డాక్టర్. పండిట్ శ్రీనివాస్ గురూజీ.. వ్యవహారంపై ప్రభుత్వ వైద్యాధికారులు దృష్టి పెట్టి.. ఇతగాడి చేతిలో వీరెవరూ మోసపోకుండా చూడాలని.. ఈ నకిలీ ఆయుర్వేద డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు