- నియమాకాలు, నిధుల వినియోగంలో అయ్యగారి గోల్మాల్..
- రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన రవీందర్ గుప్తా..
- దేవాలయం లాంటి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉంటూ దరిద్రపు పనులు..
- ఛీ ఛీ అంటున్న యావత్ విద్యార్థి లోకం..
హైదరాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ ట్రాప్లో చిక్కుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గత వారం క్రితమే ఆయనపై ఆరోపణలు రావటంతో ఏసీబీ అధికారులు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించారు. అయితే అప్పటి తనిఖీల్లో అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారో చెప్పలేదు. తాజాగా.. శనివారం ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భీమగల్లోని ఓ కాలేజీలో పరీక్షా కేంద్రం అనుమతి కోసం రూ. 50 వేలు డిమాండ్ చేయగా పక్కా సమాచారం దాడి చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఇక వర్సిటీలో నియామకాల విషయంలోనూ అవకతవకలకు పాల్పడ్డారని.. యూనివర్సిటీ నిధులు ఖర్చు చేయంటలోనూ దుర్వినియోగం చేసారని ప్రధానంగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఇవాళ పట్టుకున్నారు. దీంతో వర్సిటీలో జరిగిన నిధుల దుర్వినియోగం, అవకతవలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇటీవలే దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు :
నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి సమీపంలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల రావడం వల్ల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అకౌంట్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లలో సోదాలు చేశారు. యూనివర్సిటీలోని కళాశాల భవనాల్లోనూ విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య నెలకొన్ని గొడవలపై కూడా అధికారులు దృష్టి సారించారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ గందరగోళంగా మారింది. ఈసీ మెంబర్లకు, వీసీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజాగా రంగంలోకి దిగారు.
హైదరాబాద్లోని రూసా భవనంలో జూన్ నెల 3వ తేదీన పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, గతంలో పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు. ఆ 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్ మరోసారి డుమ్మాకొట్టారు. వీసీ అక్రమాలు చేశారని, దానిపై విచారణ కమిటీ వేయాలని సమావేశంలో పాలకమండలి మెంబర్లు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం, దినసరి ఉద్యోగం కింద పని చేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ.28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు.