బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు చేరుకున్నా.. ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించటం లేదు. 14 నెలలుగా (ఏప్రిల్ 6, 2022 నుంచి) ఇంధన ధరల్ని మార్చటం లేదు. దీంతో అధిక ధరలు, ద్రవ్యోల్బణంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. రష్యా నుంచి చవకగా ముడి చమురు కొన్నా..ఆ ప్రయోజనాన్ని దేశ ప్రజలకు బదిలీ చేయటం లేదు. మరోవైపు ప్రైవేటు కంపెనీలు రూపాయికి తక్కువకు పెట్రోలు, డీజిల్ విక్రయించాలని నిర్ణయించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గటంతో.. ఆ మేరకు వాహనదారులకు లబ్ధి చేకూర్చాలని ప్రైవేటు పెట్రో కంపెనీలు రిలయన్స్-బీపీ, నయారా ఎనెర్జీ నిర్ణయించాయి. ఆ మేరకు లీటరు పెట్రోలు, డీజిల్పై రూపాయి తగ్గించి విక్రయిస్తున్నాయి. జూన్ నెలాఖరు వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించాయి. అంతర్జాతీయంగా చమురు ధర తగ్గినా.. ప్రభుత్వరంగ చమురు సంస్థలు (బీపీ, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) మాత్రం ఇంధన ధరల్ని తగ్గించటం లేదు. ఈ ప్రభావం ఇతర వినిమయ వస్తువులపై పడి.. అధిక ధరలు, ద్రవ్యోల్బణంతో సామాన్యులు సతమతమవుతున్నాయి.
ఇంధన ధరలపై అధిక పన్నులు వసూలు చేయడం కేంద్రం లబ్ధి పొందుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్పై ‘కృత్రిమ పెంపు’ కారణంగానే ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకున్నదంటున్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు చేరినప్పుడు దేశీయంగా పెట్రో ధరలు పెంచిన కేంద్రం అధిక పన్నులు, సెస్సుల రూపంలో లబ్ధి పొందుతున్నది.