న్యూఢిల్లీ : కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్ వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సారి ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున రద్దీ రైల్లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. నిల్చోడానికి కూడా చోటు లేని రైలులో ఒకరికొకరు దూషించుకుంటూ కొట్టుకున్నారు. దీంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు వీరి మధ్య ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే , వీరి గొడవకు కారణం ఏంటన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.