ఎంఎస్ ధోనీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో ఎంతో కూల్గా కనిపిస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ధోనీని దేవుడితో సమానంగా కొలుస్తుంటారు. మిస్టర్ కూల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని ఫ్యాన్స్తో మైదానం కిక్కిరిపోవాల్సిందే. ఆదివారం ఐపీఎల్ చివరి మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అయ్యింది.ఈ ఐపీఎల్ సీజన్ ధోనీ చివరిది కావొచ్చన్న ఊహాగానాల మధ్య తమ అభిమాన క్రికెటర్ను చూసేందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన సీఎస్కే ఫ్యాన్స్తో స్టేడియం పరిసరాలు పసుపు మయం అయ్యాయి. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిజర్వ్ డేకి వాయిదా పడటంతో అహ్మదాబాద్ తరలి వచ్చిన వేలాది మంది సీఎస్కే అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి వరకూ మ్యాచ్ జరుగుతుందన్న ఆశతో నిరీక్షించారు. కానీ వరుణుడు కరుణించపోవడంతో నిరాశ చెందారు. ఈ రోజు ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు స్టేడియాన్ని వీడి.. అర్ధరాత్రి సమయంలో ఎటు వెళ్లాలో తెలియక అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొన్నారు. అక్కడ నేలపైనే నిద్రించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.