Thursday, March 28, 2024

తెలంగాణలో హిందుత్వ జోష్…

తప్పక చదవండి
  • హిందుత్వం బలహీనపడిందంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ‘‘హిందూ ఏక్తా యాత్ర’’
  • హిందూ ఏక్తా యాత్రకు హాజరై హిందుత్వ సంఘటిత శక్తిని చాటిన కాషాయ సైనికులు
  • యాత్ర సక్సెస్ తో ఫుల్ జోష్ లో బీజేపీ శ్రేణులు
  • త్వరలో జరగబోయే ఖమ్మం నిరుద్యోగ మార్చ్ను విజయవంతం చేసే పనిలో నిమగ్నమైన నాయకులు

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయనే ప్రచారానికి కరీంనగర్ లో నిన్న జరిగిన ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ తెర దించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్వహించిన ‘‘హిందూ ఏక్తా యాత్ర’’కు ఊహించని రీతిలో బీజేపీ కార్యకర్తలు, సానుభూతి పరులు, హిందుత్వ వాదులు హాజరయ్యారు. కరీంనగర్ వీధులన్నీ జన సంద్రమయ్యాయి. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రతి ఏటా కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ స్థానిక వైశ్యా భవన్ వద్ద ప్రారంభమై టవర్ సర్కిల్, కమాన్, బస్టాండ్, ప్రతిమ సెంటర్, గీతాభవన్, అర్ అండ్ బి, గర్ల్ కాలేజీ, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్యాభవన్ కు చేరుకుంటుంది. గత దశాబ్ద కాలంగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రతి ఏటా ఈ యాత్రలో 10 నుండి 20 వేల మందికిపైగా పాల్గొంటారు. ఈసారి మాత్రం ఊహించని సంఖ్యలో అనూహ్యంగా జనం తరలివచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా జనం ఈ ఏక్తా యాత్రకు హాజరైనట్లు అంచనా. ర్యాలీ వెళ్లే ప్రతిచోట జన సందోహం కన్పించింది. ఇసుక వేస్తే రాలనంతగా జనం హాజరయ్యారు. దాదాపు 5 కి.మీల పొడవునా జన సందోహం కన్పించింది. చిన్నారులు, యువకులతోపాటు మహిళలు, వ్రుద్దులు సైతం బారులు తీరారు. చంటి పిల్లలను ఎత్తుకుని తల్లులు సైతం ఇండ్ల ముందు నిలబడి ర్యాలీని తిలకించారు. వారందరికీ అభివాదం చేస్తూ ముదుకు సాగారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన యాత్ర అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. కాషాయ చీరెలు ధరించిన వందలాది మహిళలు ప్రత్యేక వేషధారణతో డప్పు వాయిద్యాలతో ఆట పాటలతో ర్యాలీకి హాజరైన వారిని అలరించారు. ప్రత్యేక వాహనంపై సీతారామచంద్రులను చేతుల్లో ఎత్తుకుని వెళుతున్న హనుమంతుడి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోని భిన్న సంస్క్రుతులతో కూడిన వేషధారణలతో మహిళలు, యువకులు ఆట పాటలతో అలరించారు. ముఖ్యంగా చిన్నారులు, యువకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. యాత్ర పొడవునా డ్యాన్సులు చేస్తూ జోష్ నింపారు. దాదాపు 5 కి.మీల పాటు సాగిన ఈ యాత్రలో ఎక్కడా విసుగు అనే పదానికి తావులేకుండా అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. చాలా చోట్ల మహిళలు, యువకులు తమ ఇండ్ల ముందు నిలబడి ర్యాలీ రాక కోసం చంటి పిల్లలను పట్టుకుని ఓపికగా వేచి చూడటం కన్పించింది. తమ వద్దకు ర్యాలీ రాగానే బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా జనం హాజరు కావడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. కర్నాటక ఎన్నికల ఫలితాలతో హిందుత్వ వాదం బలహీనపడిందని అధికార బీఆర్ఎస్, కాంగ్రెస, కమ్యూనిస్టు నేతలు చేస్తున్న ప్రచారానికి ఈ యాత్రతో ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. రెట్టించిన ఉత్సాహంతో త్వరలో ఖమ్మంలో జరగబోయే నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేసే పనిలో రాష్ట్ర నాయకులు నిమగ్నమయ్యారు. తెలంగాణలో హిందుత్వం పనిచేయదని, ఓటు బ్యాంకు కాబోదంటూ ఆయా పార్టీలు చేస్తున్న ప్రచారానికి తెరదించేందుకే ఈ యాత్ర నిర్వహించామని, పెద్ద ఎత్తున హిందుత్వ వాదులంతా ఈ యాత్రకు హాజరు కావడం ద్వారా హిందుత్వ వాదుల దమ్ము చూపించారని ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. యాత్రకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్నాటక ఫలితాలకు, తెలంగాణలోని రాజకీయ వాతావరణానికి సంబంధమే లేదని, ఇక్కడ ప్రజలంతా కేసీఆర్ పాలన పట్ల విసిగిపోయారన్నారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చేశారని, ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తాను చేపట్టిన పాదయాత్రకు, నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల్లో నిర్వహిస్తున్న ర్యాలీలకు తరలివచ్చిన జనమే ఇందుకు నిదర్శనమన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు