Friday, April 19, 2024

మరణంలోనూ ఒకరి కొకరు..

తప్పక చదవండి
  • హైదరాబాద్‌ అంబర్‌పేటలో తీవ్ర విషాదం
  • భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య
  • పెళ్లి జరిగిన ఏడాదికే రోజుల వ్యవధిలోనే ఇద్దరి మరణం

విధి ఎంత విచిత్ర మైనది.. ఎంత కఠినమైంది. మూడు ముళ్లతో ఒకటై, అయినవారికి దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జంటపై కన్ను కుట్టిందో ఏమో.. పెళ్లై ఏడాది కూడా తిరగకుండానే.. భర్తను హార్ట్ ఎటాక్ రూపంలో మృత్యువు తీసుకెళ్లిపోయింది. తానే సర్వస్వమని నమ్మి తన చిటికన వేలు పట్టుకుని ఏడడుగులు వేసి.. అతనితో ఏడు సముద్రాలు దాటి వెళ్లిన ఆ భార్య.. తన కన్నవాళ్లను చూసేందుకు ఒంటరిగా వచ్చి.. ఒంటరిగానే మిగిలిపోయింది. తన భర్త.. ఇక తనతో లేడన్న బాధతో కుమిలిపోయింది. తన భర్త లేడన్న బాధ భరించలేక.. అతను లేని లోకంలో బతకలేక.. చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. నిన్ను విడిచి నేనుండలేను.. నేనూ నీ దగ్గరికే వస్తున్నా.. అంటూ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ గుండెలు పిండేస్తున్న ఘటన హైదరాబాద్‌లోని అంబర్ పేటలో జరిగింది.

హైదరాబాద్ : హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితికి ఏడాది కిందట వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పెళ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ… ఉద్యోగరిత్యా అమెరికాకు షిఫ్ట్ అయిపోయి.. డల్లాస్‌లోనే ఉంటున్నారు. బంధువులందరికీ దూరంగా ఉంటున్నా.. వాళ్లిద్దరు మాత్రం ఒకరికి ఒకరు అన్నట్టుగా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే.. అమ్మానాన్నలను చూసొస్తానని.. సాహితి ఈనెల రెండో తేదీన అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. భర్తను విడిచి ఒంటరిగా ఇక్కడికి వచ్చినా… రోజూ ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకుంటూ.. దగ్గరగానే ఉన్నారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ.. ఈ నెల 20న మనోజ్‌కు ఒక్కసారిగా హార్ట్‌ ఎటాక్ రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలిసి.. సాహితి ఒక్కసారిగా కుంగిపోయింది. ఎన్నో ఆశలతో, ఇంకెంతో ప్రేమతో.. భర్తతో తన జీవితాన్ని ఊహించుకున్న సాహితికి మనోజ్ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. అమెరికా నుంచి ఈనెల 23న మనోజ్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆ తెల్లారి మనోజ్‌ అంత్యక్రియలు ముగిశాయి. దాంతో.. సాహితి ఇంకా కుమిలిపోయింది. సాహితి బాధను చూసి తట్టుకోలేక.. తన కూతురిని తల్లిదండ్రులు అంబర్‌పేట డీడీ కాలనీలోని తమ నివాసానికి తీసుకెళ్లారు. తన అక్కను క్షణం కూడా వదలకుండా తన చెల్లి పట్టుకోనే ఉంది. రాత్రి కూడా అక్కను అంతిపెట్టుకోనే పడుకుంది. అయితే.. ఈరోజు ఉదయం.. తొమ్మిదిన్నర సమయంలో.. సాహితి చెల్లెలు వాష్‌రూమ్‌కని అక్కను విడిచి బయటకు వెళ్లింది. అమె బయటకు వెళ్లి వచ్చేటప్పటికి గదికి లోపలి నుంచి లాక్ చేసి ఉంది. అక్కను ఎంత పిలిచినా పలకలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే.. చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతోంది. చెల్లి బయటకు వెళ్లి వచ్చే పది నిమిషాల్లోనే సాహితి ఈ కఠిన నిర్ణయం తీసుకోవటం కుటుంబసభ్యులను కలచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగిన ఏడాదిలోనే.. రోజుల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు ఇలా చనిపోవటం పట్ల బంధువులంతా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు