- మెడిసిన్ చదివే స్టూడెండ్స్కు శుభవార్త
- యాదాద్రి భువనగిరి సహా ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు
- 10 వేలకు చేరువకానున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- సాకారమవుతున్న రాష్ట్ర సీఎం కేసీఆర్ కల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి వైద్య రంగాన్ని పటిష్టం చేస్తామని తెలంగాణ సీఎం పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే పలు జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాట్లు చేశారు. తాజాగా.. మెడిసిన్ చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినట్లైంది. కొత్తగా ఏర్పాటయ్యే ఎనిమిది వైద్య కళాశాలలతో కలిపి తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువకానుంది.
తాజాగా.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల, వరంగల్, ములుగు, మెదక్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం సాకారం కానుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో జిల్లాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగుపడతాయన్నారు. మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు మరిన్న అకాశాలు వస్తాయని చెప్పారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.