- నేషనల్ జ్యూడీషియల్ డేటా గ్రిడ్కు అనుసంధానం
- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో పెండిరగ్ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలు ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ పోర్టల్(ఎన్జేడీజీ)కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు డేటాను పొందుపరిచే ఎన్జేడీజీ పోర్టల్లో త్వరలో సుప్రీంకోర్టుల కేసుల వివరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది చరిత్రాత్మకమైన రోజు. సుప్రీంకోర్టులో పెండిరగ్, పరిష్కారమైన కేసుల వివరాలు త్వరలో ఎన్జేడీజీ పోర్టల్లో చూసుకోవచ్చు. సంవత్సరాలవారీగా పెండిరగ్లో ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. ఎన్జేడీజీలో సుప్రీంకోర్టు డేటాను అప్లోడ్ చేయడం వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న దిగువస్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల స్థాయి వరకు డేటా ఎన్జేడీజీలో అందుబాటులో ఉంటుంది. ఇందులో పెండిరగ్, పరిష్కారమైన కేసుల వివరాలు ఉంటాయి. రెండు రోజుల క్రితం (సెప్టెంబరు 12) భారత శిక్షాస్మృతిలోని రాజద్రోహం నిబంధనకు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు .. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విస్త్రృత ధర్మాసనానికి బదిలీ చేసే నిర్ణయాన్ని వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సంబంధిత పత్రాలను సీజేఐ ఎదుట ఉంచాలని.. తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని రిజిస్ట్రీని ఆదేశించింది. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అందుకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం పార్లమెంటు స్థాయీసంఘం పరిశీలనలో ఉన్నట్లు గుర్తు చేసింది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. రాజద్రోహానికి సంబంధించిన 124ఏ నిబంధన అమల్లో ఉన్నంత కాలం.. ఆ సెక్షన్ కింద విచారణ కొనసాగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కోణంలో నిబంధనపై మదింపు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
తప్పక చదవండి
-Advertisement-