- రూ.2వేల నోట్ల మార్పిడిపై స్పష్టతనిచ్చిన ఎస్బీఐ..
- రిక్వెస్ట్ ఫామ్ నింపాలని, గుర్తింపు పత్రం చూపాలన్నది ఉత్తదే..
- రసీదులు, రిక్వెస్టులు ఏమీ అవసరం లేదన్న స్టేట్ బ్యాంక్..
- నేరుగా వెళ్లి ఒక విడతలో రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు..
న్యూ ఢిల్లీ : రూ.2 వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కీలక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి ప్రజలు ఎలాంటి గుర్తింపు పత్రం లేదా రసీదు చూపించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన అన్ని శాఖలకు ఎస్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఫార్మ్ లేకుండా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్చుకోవచ్చని అందులో పేర్కొంది. బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్ను పూరించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ దీనిపై స్పందించింది. రూ.2,000 నోట్ల మార్పిడి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని, ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
కాగా, రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీబీ) శుక్రవారం తెలిపింది. అయితే ప్రజలు ఆ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని లేదా తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పింది. ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు ఇతర బ్యాంకులు రూ.2,000 నోట్లను ఈ నెల 23 నుంచి స్వీకరిస్తాయని పేర్కొంది. బ్యాంకులో ఖాతా లేకపోయినా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను మార్పిడి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.