- కొత్త వివాదంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
- వైరల్ అవుతున్న వీడియోపై అనుమానాలు..
- పార్లమెంట్ నుంచి వెళుతూ చేసినట్టు ఆరోపణ..
- స్పీకర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు..
- తాను నిశ్చేష్టురాలిని అయ్యానన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
- స్త్రీ ద్వేషి అయితేనే అలా చేస్తారంటూ మండిపాటు..
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రెండో రోజు లోక్సభ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ నేపథ్యంలోనే మణిపూర్ అంశంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్గా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రసంగం ముగిసిన తర్వాత లోక్సభ నుంచి బయటికి వెళ్తూ రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని.. బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు. ఈ ఘటనపై సభాపతికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు కూడా స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.
ప్రతిపక్ష పార్టీలు మోదీ సర్కార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మణిపూర్ అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం అవిశ్వాసంపై చర్చ పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్సభ నుంచి బయటికి వెళ్లారు. అయితే రాహుల్ వెళ్లేటపుడు.. ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన సభలో ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. రాహుల్పై వచ్చిన ఆరోపణలపై స్మృతి ఇరానీ పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. ఒక స్త్రీ వ్యతిరేకి మాత్రమే ఇలా పార్లమెంట్లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరని అన్నారు. రాహుల్ గాంధీ చర్యలు.. ఆయనకు మహిళల పట్లు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని.. ఇది అసభ్యకరమైందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మరోవైపు.. రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై బీజేపీకి చెందిన పలువురు మహిళా ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. రాహుల్ అనుచిత ప్రవర్తనపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే.. పలువురు మహిళా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను స్పీకర్కు అందించారు. ఇలా మహిళా ఎంపీల పట్ల రాహుల్ గాంధీ తీరు పట్ల కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేసేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
అది వీడ్కోలు సూచనే, ఎవరినీ ఉద్దేశించి కాదు : కాంగ్రెస్ కౌంటర్
సభకు వీడ్కోలు సంకేతంగా ఆయన ఈ సంజ్ఞ చేశారే కానీ, ఏ ఒక్క మంత్రినో, ఎంపీనో ఉద్దేశించి కాదని తెలిపింది. సభలోని వారిని సోదర, సోదరీమణులుగా సంబోధించిన రాహుల్, సభను విడిచిపెడుతూ ఫ్లయింగ్ కిస్తో సంకేతం ఇచ్చారు. ఈ సంకేతం ఏదో ఒక మంత్రినో, ఎంపీనో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీనో ఉద్దేశించి కాదని కాంగ్రెస్ నేత ఒకరు వివరించారు.