Friday, March 29, 2024

పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ

తప్పక చదవండి
  • అధికార పార్టీలో తారాస్థాయికి చేరిన లీడర్ల వర్గపోరు
  • బీజేపీలో అందరు లీడర్లే.. పోటీపై సందిగ్దత
  • వన్‌ మెన్‌ షోగా కాంగ్రెస్‌ పోటీ చేసే అభ్యర్థుల కార్యక్రమాలు
  • వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్న డీసీసీబీ చైర్మన్‌
  • మనోహర్‌ రెడ్డి వ్యతిరేకులను ఏకంచేసే పనిలో ఎమ్మెల్యే
  • సమర్ధుడికి పట్టం కట్టే యోచనలో నియోజకవర్గ ప్రజలు

హైదరాబాద్‌ : పరిగి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ గా పోటీ ఉండబోతుందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఐదు సార్లు టీడీపీని ఆదరించిన పరిగి ప్రజలు అరవసారి సమర్థుడైన నాయకుడు టీడీపీ నుంచి పోటీచేస్తే ఖచ్చితంగా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగంగానే తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాసాని వీరేశ్‌ పరిగి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంతో పరిగి రాజకీయం ఒక్కసారీగా వేడెక్కింది. అధికార పార్టీ వర్సెస్‌ టీటీడీపీ కార్యకర్తల పోటాపోటీ కార్యక్రమాల జోరు పెరిగింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి పరిగి నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండటమే గాక పరిగిని అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని కాసాని వీరేశ్‌ చెప్పగా.. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అధిష్టానం టికెట్‌ ఇవ్వకపోవచ్చు నాకే టికెట్‌ వస్తుంది నన్ను ఆదరించండని మరో బీఆర్‌ఎస్‌ నేత వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నాడు.

వన్‌ మెన్‌ షోగా కాంగ్రెస్‌ పోటీ చేసే అభ్యర్థుల కార్యక్రమాలు.. బీజేపీలో పోటీ చేసే అభ్యర్థిని నేనంటే నేను అని చెప్పుకునే లీడర్ల వ్యవహారశైలితో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. నాయకుల మధ్యన ఏర్పడిన సమన్వయ లోపంతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇప్పటికే పరిగి నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయిన వీరేశ్‌ అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో పరిగిని అగ్రస్థానంలో నిలబెడతానని నియోజకవర్గ ప్రజలకు హామి ఇస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడంతో కార్యకర్తలు, నాయకులు ఎటు తేల్చుకోలేక పోతున్నారు. ఒకరి కార్యక్రమానికి పొతే మరోకరి కోపానికి గురికావాల్సి వస్తుందని వాపోతున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడిరది.

- Advertisement -

వీరేశ్‌ పరిగి నుంచి పోటీ చేయాలనీ స్థానికుల డిమాండ్‌
నిజానికి కాసాని వీరేశ్‌ మంచి మానవతా వాదీ. కాసాని జ్ఞానేశ్వర్‌ ఆలోచనలను, ఆశయాలను పునికిపుచ్చుకున్న ఆయన ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతదూరమైనా వెళతారు. కోవిడ్‌ నేపథ్యంలో ఏర్పడ్డ సంక్షోభంలో పరిగి నియోజక వర్గ ప్రజలను ఆదుకోవడంలో ఆయన ముందున్నారు. చేసిన సహాయానికి ప్రచారం అవసరంలేదని చెప్పే గొప్ప మనసున్న నాయకుడిగా వీరేశ్‌ కు మంచి పేరుంది. ఆయన గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా.. అయన నుంచి దూరం గా పోలేరన్నది అక్షర సత్యం. అటువంటి నాయకుడు పరిగి నుంచి పోటీ చేస్తే నియోజక వర్గ ప్రజలకు మంచి జరుగుతుందని భావించిన కొంతమంది కుల సంఘాల పెద్దలు వీరేశ్‌ ను పరిగి నుంచి పోటీ కి దింపాలని చూస్తున్నట్లు సమాచారం. టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆదేశానుసారం నిర్ణయం ఉంటుందని వారు అవకాశం ఇస్తే తప్పక పోటీ చేస్తానని కుల సంఘాల పెద్దలకు వీరేశ్‌ చూపినట్లు తెలిసింది.

బీఆర్‌ఎస్‌ పార్టీలో రాజకీయ వర్గపోరు తారాస్థాయికి
వికారాబాద్‌ జిల్లా పరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలో రాజకీయ వర్గపోరు తారాస్థాయికి చేరింది.. అధికార పార్టీకి చెందిన నాయకులు వారికి వారే.. పక్కలో బల్లెల్లా మారి నువ్వా.. నేనా అన్న తీరుగా నియోజకవర్గంలో హల్చల్‌ చేస్తున్నారు.. తాండూరుకే పరిమితమైన అధికార పార్టీ అసమ్మతి ఇప్పుడు పరిగి ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డిని వెంటాడుతుంది. ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి అదే పార్టీకి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది.

పరిగి ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డికి పక్కలో బల్లెంలా మనోహర్‌ రెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్‌ గా కొనసాగుతున్న మనోహర్‌ రెడ్డి ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారయ్యాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ మనోహర్‌ రెడ్డి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని ధీమాతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి పై అసంతృప్తిగా ఉన్న టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను నేతలను తన వైపు తిప్పుకునే పనిలో పడ్డాడు మనోహర్‌ రెడ్డి. గ్రామస్థాయిలో పార్టీ అధ్యక్షులతో పాటు సర్పంచులు మండల స్థాయి ముఖ్య నేతలతో టచ్‌ లో ఉంటూ చాపకింద నీరులా తన వర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డాడు మనోహర్‌ రెడ్డి.

డోంట్‌ వరీ టికెట్‌ నాదే : ఎమ్మెల్యే మహేష్‌
ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి మాత్రం తనకేవ్వరూ పోటీలేరని మళ్ళీ తనకే ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందని తన అనుచర గణంతో ధీమా వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో గతంలో కంటే చురుగ్గా పాల్గొంటున్నారు . మనోహర్‌ రెడ్డి వైపు వెళ్లే అసమ్మతి నేతలను పిలిచి వారించే ప్రయత్నం చేస్తున్నాడు. రోజుకోచోట పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. డబ్బులకు ఎవరు అమ్ముడుపోవద్దంటూ నేరుగా కార్యకర్తలకు సూచిస్తున్నాడు. కానీ ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి ఎంత వారించే ప్రయత్నం చేసిన అసమ్మతి నేతల చూపు మాత్రం మనోహర్‌ రెడ్డి వైపే ఉంది.

ఎమ్మెల్యే పై నిరసన సెగ
ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లేకపోవడం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ బతుకమ్మ చీరల పంపిణీ తప్ప మరే కార్యక్రమాలు చేపట్టకపోవడం ఒకింత వ్యతిరేకత నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత నెలకొంది. గ్రామాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలపై, అభివృద్ధిపై ప్రజలు ప్రశ్నించడంతో అనేకసార్లు వారిపై అసహనానికి గురై నోరుజారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎమ్మెల్యే పై వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునేందుకు మనోహర్‌ రెడ్డి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ… నేతలను ఆకట్టుకుంటూ నియోజకవర్గంలో చర్చనీయాంశమైన వ్యక్తిగా మారాడు. గతేడాది ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి కార్తిక మాసంలో కోటి దీపోత్సవం నిర్వహించగా..దీటుగా మనోహర్‌ రెడ్డి మూడు వేల మందితో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించి తన భక్తి చాటున రాజకీయం మొదలుపెట్టారు. మహేష్‌ రెడ్డితో పొసగని కొందరు సర్పంచులు బహిరంగంగానే మనోహర్‌ రెడ్డి వెంబడి తిరుగుతుండగా.. వారికి చెక్‌ పెడుతూ ఎమ్మెల్యే మహేష్‌ రెడ్డి అసమ్మతి సర్పంచుల వ్యతిరేకులను పార్టీలో చేర్చుకుంటున్నాడు.ఏమ్మెల్యే సోదరుడు అనిల్‌ రెడ్డి మా అన్న సపోర్ట్‌ చేయడం వల్ల డిసిసిబి చైర్మన్‌ పదవి వచ్చిందంటూ.. అనడంతో దానికి కౌంటర్‌ గా ఎవరికి ఏ పదవులు ఊరికి రావని పని చేస్తేనే పార్టీలో పనులు వస్తాయని డిసిసిబి చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు