- ఆట్టారీ వాఘా సరిహద్దులో వదిలేసినా పాకిస్తాన్..
- కరాచీ సమీపంలోని లాఠీ జైల్లో జాలరులు..
- భారత ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యం అయ్యింది..
- భారత గడ్డను ముద్దాడిన జాలరులు..
అట్టారీ, 03 జూన్ :
అట్టారీ-వాఘా సరిహద్దు జాయింట్ చెక్ పోస్ట్ వద్ద 200 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆ తర్వాత వారిని భారత సరిహద్దు భద్రతా దళానికి అప్పగించారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ జారీ చేసిన ‘ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్’ను ఉపయోగించి మత్స్యకారులందరూ అట్టారీ-వాఘా సరిహద్దు భూ రవాణా మార్గం ద్వారా తెల్లవారుజామున 1 గంటలకు భారతదేశానికి చేరుకున్నారని ఓ అధికారి తెలిపారు. వారంతా గుజరాత్లోని పోరుబందర్, సోమ్ నాథ్, గిర్ ప్రాంతాలకు చెందిన జాలర్లు ఇన్నాళ్లు కరాచీ సమీపంలోని లతీ జైలులో ఉన్నారు. ప్రస్తుతం వీరు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రభుత్వం చర్యలతో గత నెలలో కూడా పాకిస్థాన్ ప్రభుత్వం 199 మంది జాలర్లను విడుదల చేసింది.
మత్స్యకారుల పడవలు అరేబియా సముద్రంలో ప్రాదేశిక జలాల గుండా పాకిస్థాన్లోకి జారిపోయాయని ఆరోపిస్తూ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా భారతీయ వైద్యుల బృందం మత్స్యకారులను స్వదేశానికి తరలించిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. భారత గడ్డపై అడుగు పెట్టగానే మత్స్యకారులు వంగి భూమిని ముద్దాడారని వెల్లడించారు.