Saturday, April 20, 2024

ఫిర్యాదులు అందినా పట్టించుకోరా..?

తప్పక చదవండి


( జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ ఏఈ జక్రామ్ అవినీతిపై మీనమేషాలు..)

  • ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆసాంతం మిగేసిన ఏ.ఈ.
  • కాంట్రాక్టర్ లతో కుమ్మక్కై నిధులను కైకర్యం చేసిన అధికారి..
  • నాశిరకం మెటీరియల్.. అసంపూర్తి పనులు.. మొత్తం బిల్లుల స్వాహా..
  • వాటాలేసుకుని పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లు..
  • జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
    అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాజిక కార్యకర్త ఎం. ముజాఫర్..

జరిగిన పనులు నాశిరకం అని తెలుసు.. కళ్లెదుటే అధికారి అవినీతి చేశాడని తెలుసు.. సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు తమ టేబిల్ మీద ఉందని తెలుసు.. అన్నీ తెలిసినా అవినీతిని అరికట్టడంలో, తప్పుచేసిన అధికారులమీద చర్యలకు ఉపక్రమించడంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు ఉన్నతాధికారులు.. ఇలాంటి దౌభాగ్యపు పరిస్థితులు జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ లో చోటుచేసుకున్నాయి.. అక్రమాలు జరిగాయని బాధ్యతగలిగిన ఒక సామానిక కార్యకర్త జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు.. అక్రమార్జనలో ఉన్నతాధికారులకు వాటాలు అందుతున్నందువల్లే ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదనే విమర్శలు బహిరంగంగా వెల్లువెత్తుతున్నాయి..

- Advertisement -

హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
హైదరాబాద్ పాత బస్తీలో భారీ వర్షాలు కురిస్తే అక్కడి పరిస్థితులు అగమ్యగోచరంగా మారతాయి.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అవడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి, చివరికి ఇళ్లలోకి కూడా వచ్చిన దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. నాలాలు కబ్జాలకు గురికావడమే దీనికి ప్రధాన కారణం.. ఈ పరిస్థితిని చక్కదిద్ది అక్కడి ప్రజల నిత్యా జీవన వ్యవహారం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నాలాల పునరుద్దరణ కోసం కార్యాచరణ చేపట్టింది.. ఇందుకోసం కోట్ల రూపాయలు కేటాయించింది.. నాలాలు సక్రమంగా ప్రవహించేందుకు గాను బాక్స్ డ్రైన్స్ నిర్మించాలని కేటాయించిన ఫండ్ పై కన్నేశారు కాంట్రాక్టర్లు.. కొందరు అవినీతి అధికారులను లోబరుచుకుని ప్రభుత్వ ధనాన్ని కాజేసేందుకు నడుం కట్టారు.. ఈ అవినీతి వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు జీ.హెచ్.ఎం.సి. సౌత్ జోన్ ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏ.ఈ. జక్రామ్.. ఇతగాడు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై, అప్రూవల్ ఎస్టిమేషన్ ప్రకారం పూర్తి పనులు చేయకుండా.. కనీస సాంకేతిక ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లేని మెటీరియల్ వాడుతూ.. పనులను సైతం అసంపూర్తిగా చేసి.. ప్రభుత్వానికి పూర్తిగా పనులు అయినట్లు బిల్లులు సమర్పించి.. మొత్తం పైకాన్ని శాంక్షన్ చేయించారు.. అందులో కొంత భాగాన్ని కాంట్రాక్టర్ లు, మరికొంత భాగాన్ని కొందరు అధికారులు సదరు ఏ.ఈ. జక్రామ్ ద్వారా పంచుకున్నట్లు తెలుస్తోంది.. ఇదే విషయంపై పూర్తి ఆధారాలు సేకరించిన ఎం. ముజాఫర్ అనే సామాజిక కార్యకర్త, కమిషనర్ జీ.హెచ్.ఎం.సి.కి ఫిర్యాదు చేశారు..

ఏ.ఈ. జక్రామ్ ఆధ్వర్యంలో పలు పనులు అసంపూర్తిగా జరిగాయి ఆ వివరాలు ఇలా ఉన్నాయి :

  1. 3. రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇంటి నెంబర్ 19-4-8/402 నుండి 19-4-8/200/4 వరకు : ఆల్ జుబైల్ కాలనీ, ఆశ్మబాద్ : 2,32,25,000 రూపాయలు..
  2. 2. 5. 00 ఎం. / 3. 00 ఎం. బాక్స్ డ్రైన్ మురికి నాలా హై స్కూల్ టెన్షన్ టవర్ దగ్గర , ఆశ్మాబాద్ : 2,14,76,206 రూపాయలు..
  3. ఆర్.సి.సి. బాక్స్ డ్రైన్.. బిస్మిల్లా కేఫ్ నుండి హఫీజ్ బాబా నగర్ వరకు.. విలువ : 1,22,15,061 రూపాయలు..

అయితే దౌర్భాగ్యం ఏమిటంటే.. సగం సగం పనులు చేసి.. పూర్తి బిల్లు శాంక్షన్ చేయించుకున్నట్లు ముజాఫర్ ఆరోపిస్తున్నారు.. అంతే కాకుండా మిగిలిన సగం పనులకు మళ్ళీ టెండర్స్ పిలిచినట్లు కూడా ఆయన ఆరోపిస్తున్నారు.. కాగా జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా జరిగిన తంతుపైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.. అవినీతి సొమ్ములో వాటాలు అందడం వల్లే చర్యలకు వెనుకాడుతున్నారునై ఆరోపిస్తున్నారు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే తాను న్యాయపోరాటానికి కూడా వెనుకంజ వేయమని హెచ్చరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు